Jun 23,2023 22:35

ప్రజాశక్తి - భీమడోలు
              జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఆర్‌డిఎ పీడీ, కార్యక్రమ భీమడోలు మండల ప్రత్యేక అధికారి ఆర్‌.విజయరాజు కోరారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భీమడోలు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని డిఆర్‌డిఎ పీడీతో పాటు మండల స్థాయి అధికారులు తిలకించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ మాట్లాడుతూ భీమడోలు మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహణ తేదీలు మారాయన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని 17 గ్రామ సచివాలయాల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్న తేదీల వివరాలను ఆయన తెలిపారు. ఈ మేరకు జూలై ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమాల నిర్వహణకు రెండు ప్రత్యేక టీములు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఒక దానిలో భీమడోలు మండల అభివృద్ధి అధికారి సిహెచ్‌.పద్మావతిదేవితో పాటు డిప్యూటీ తహశీల్దార్‌ షంషుద్దీన్‌ సభ్యులుగా ఉంటారన్నారు. రెండో టీంలో భీమడోలు తహశీల్దార్‌ ఎం.ఇందిరాగాంధీతో పాటు ఇన్‌ఛార్జి ఇఒపిఆర్‌డి ముత్తయ్య సభ్యులుగా ఉంటారన్నారు.
ముదినేపల్లి : అర్హులై ఉండి ఏ కారణంతోనైన ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటింటా జల్లెడ పట్టనున్నట్లు ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన జగనన్న సురక్ష వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలకు, వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్తి స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తహాశీల్దార్‌ కె.శ్రీనివాసరావు, ఎంపిడిఒ పి.మల్లీశ్వరి, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంటా సంధ్య, జెడ్‌పిటిసి సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ, వైస్‌ ఎంపిపి రాచూరి రాధా, వివిధ శాఖల మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ముసునూరు : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది విజయవంతంగా అమలు చేయాలని నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ అన్నారు. మండలంలోని లోపుడి గ్రామ సచివాలయంలో జెడ్‌పిటిసి సభ్యులు వరికూటి ప్రతాప్‌, వైస్‌ ఎంపిపి రాజానాయన, సర్పంచి పేరం కృష్ణ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జగనన్న సురక్ష అమలపై అవగాహన కల్పించి, గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో తహశీల్దార్‌ దాసరి సుధ, ఎంపిడిఒ జి.రాణి, ఇఒపిఆర్‌డి బసవరాజు అచ్యుత సత్యనారాయణ, ఎంపిడిఒ కార్యాలయ ఎఒ కె సాయిరాం, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.
పోలవరం : అర్హులందరికీ అన్ని పథకాలు అందించాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఎంపిపి సుంకర వెంకటరెడ్డి అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటిడిఎ పిఒ జివివి.సత్యనారాయణ, ఎంపిపి సంఘాల అధ్యక్షులు, పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, తహశీల్దార్‌ బి.సుమతి, జెడ్‌పిటిసి సభ్యులు కలుం హేమకుమారి, ఎంపిడిఒ జి.శ్రీను, ఎఒ సిహెచ్‌.శ్రీనివాస్‌బాబు, వైసిపి మండల కన్వీనర్‌ బుగ్గ మురళీకృష్ణ, ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఎపిఒలు వెంకటరమణ, మాధవరావు, హౌసింగ్‌ ఎఇ రమణరావు, ఎపిఎం బి.శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపి మీడియం సింగరాజు, యామల శ్రీదేవి, ఎంపిటిసి సభ్యులు, పిఆర్‌ఎఇ ఇన్‌ఛార్జి, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ సందీప్‌ కుమార్‌, సచివాలయ సిబ్బంది వీక్షించారు. మండలంలోని కొత్త పట్టిసీమ గ్రామపంచాయతీలో జగనన్న సురక్ష కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్‌లో సర్పంచి మైగాపుల విజయదుర్గ, ఎంపిటిసి సభ్యులు ఉలవల వరలక్ష్మి, ఉప సర్పంచి శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి తాతి విజయకుమారి, సుబ్రహ్మణ్యం, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
మండవల్లి : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని డిప్యూటీ కలెక్టర్‌ జోనల్‌ మేనేజర్‌ ఎపిఐఐసి కె బాబ్జి కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాలంటీర్లు జగనన్న సురక్షకు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి వివరాలను తెలుసుకోవాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాలు జులై ఒకటో తేదీ నుండి 20 వరకు జరుగుతాయని తెలిపారు. తహశీల్దార్‌, ఎంపిడిఒతో కూడిన రెండు టీములు ఇంటింటికి తిరిగి వివరాలు నమోదు చేసుకుంటారన్నారు. నమోదు చేసుకున్న సమస్యలను త్వరితగతన పరిష్కరించి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రమణ, తహశీల్దార్‌ రాజకుమార్‌, సెక్రటరీలు, విఆర్‌ఒలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.