జగనన్న సురక్ష క్యాంప్లు పకడ్బందీగా నిర్వహించాలి: జెసి
ప్రజాశక్తి -యాదమరి: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షను ప్రారంభించారని జిల్లా జెసి పి. శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం యాదమరి మండలం కోనాపల్లి సచివాలయంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను జేసి పరిశీలించారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, వైద్య పరీక్షలు పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ క్యాంప్ నిర్వహించే ప్రదేశం, తేది, సమయం వివరాలను ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, క్యాంప్ నిర్వహణలో వైద్యలు, సంబంధిత సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. వాలంటీర్ లు, ఏఎన్ఎం లు ప్రతి ఇంటికీి వెళ్లి సర్వే నిర్వహించి వైద్య పరీక్షల కోసం అవసరమైన వారికి టోకన్లు అందించాలని, టోకెన్ లు పొందిన వారిని వైద్య శిబిరాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిస్తోందని, ప్రజలు ఈ క్యాంప్ లను సద్వినియోయం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరం ఏర్పాటులో భాగంగా ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ ను జే సి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జే సి వెంట డి ఎల్ డి ఓ రవి కుమార్, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.










