
ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో ఎండపల్లి గ్రామానికి సంబంధించి జగనన్న లేఅవుట్ నిమిత్తం కేటాయించిన భూమిని గురువారం తహసిల్దార్ జానకమ్మ, భూగర్భ గనుల శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్ పావని పరిశీలించారు. జగనన్న ఇళ్ళ నిర్మాణాలకు కేటాయించిన 30 సెంట్లు స్థలంలో కొంతమేర కొండ ప్రాంతం ఉండటంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. 20 సెంట్లు మేర కొండ ప్రాంతం ఉండటంతో ఆ ప్రాంతాన్ని లెవెల్ చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా మైనింగ్ అధికారులు మాట్లాడుతూ, తవ్విన మట్టిని (గ్రావెల్) ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అనుమతి ఇచ్చేది లేదని, ఆ ప్రాంతంలోనే తవ్వి లెవెల్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉర్ధవరావు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.