
ప్రజాశక్తి-పద్మనాభం : తమ భూమిలో జగన్న కాలనీల ఇళ్లు కట్టనివ్వబోమని భూసాగుదారులు స్పష్టంచేశారు. పద్మనాభం మండలం గంధవరం రెవెన్యూ పరిధిలో జగనన్న కాలనీకి కేటాయించిన భూమి వద్ద ఆదివారం సాగుదారులు ఆందివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు లగుడు దేముడు, రాజాన రమణ, రాజాన సీత, రాజాన సోములు మాట్లాడారు. గంధవరం రెవెన్యూ పరిధిలోని కొండ ప్రాంతంలో ఎగుడుదిగుడుగా ఉన్న భూమిలో 50 సంవత్సరాల నుంచి మామిడి, జీడి, టేకు, ఇతర జాతుల చెట్లు వేసుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూమిలో ఎక్కడో ఉన్న పట్టణ ప్రజలకు ఇళ్ల స్థలాలిచ్చి తమ జీవనోపాధిని దెబ్బతీసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. భూమిలో 50 సంవత్సరాలు పెంచిన చెట్ల ఫలసాయం ఉంటుండుగానే తొలగించారని తెలిపారు. రైతుల గోడు వినకుండా 2019లో జిల్లా అధికారులు ఇష్టానుసారం వ్యవహరించారని ఆరోపించారు. మామిడికాయలు ఉన్నాయని, నెలరోజుల తర్వాత తొలగించాలని అప్పటి జాయింటు కలెక్టర్గా ఉన్న సూర్యకళను కోరినట్లు తెలిపారు. ఫలసాయానికి ప్రభుత్వం నష్టపరిహరం ఇస్తుందని చెప్పి జెసిబిలతో సుమారు వంద ఎకరాలు భూమిలో ఉన్న చెట్లును నేల కూల్చారని, దానికి సంబంధించి నేటికీ నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. భూమికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని తెలిపారు. దీనిపై కలెక్టర్, తహశీల్దార్, ఆర్డిఒలకు పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందించలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తమ భూములను రక్షించుకుంటామని స్పష్టంచేశారు. భూమి దక్కకపోతే 30 మంది రైతులమూ ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.