ప్రజాశక్తి - మునగపాక రూరల్
జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని డిఎల్డిఓ మంజుల వాణి కోరారు. మండల కేంద్రంలోని జగనన్న లేఅవుట్-1ను శుక్రవారం ఆమె సందర్శించారు. లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో వారికి తలెత్తే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని లబ్ధిదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, ఇన్ఛార్జి తహశీల్దారు వినరు కుమార్, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామంలో జగనన్న లే ఆవుట్లను మండల ప్రత్యేక అధికారి రోజారాణి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుడు ఉగాది నాటికి ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్పిడిఓ కొంకి అప్పారావు, సర్పంచ్ ఉప్పు నూరి మాణిక్యం, హౌసింగ్ డిఇ మధురరాణి, ఎఇ శ్రీనివాసరావు గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు.
నక్కపల్లి : మండలంలోని గొడిచెర్లలో జగనన్న లేఅవుట్లలో చేపడుతున్న గృహ నిర్మాణ పనులను ఎంపీడీవో సీతారామరాజు పరిశీలించారు. శుక్రవారం ఆయన హౌసింగ్ ఏఈ రాజు, పంచాయతీ కార్యదర్శి సాయి లక్ష్మి, వైసిపి నాయకులు అల్లు రమణ, వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో కలిసి గృహ నిర్మాణం పనులను పరిశీలించారు. వేగంగా ఇంటి నిర్మాణం పనులను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరితగతిన ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని హౌసింగ్ అధికారులకు సూచించారు.
కోటవురట్ల : జగనన్న గృహాలు ఉగాది నాటికి పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ సూచించారు. లింగాపురం గ్రామంలో జగనన్న కాలనీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన బిల్లులు సకాలంలో అందజేయాలని సిబ్బందికి సూచించారు. నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు నిర్మాణాలకు సిమెంట్ కొరతపై ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, హౌసింగ్ జగదీశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కరుణ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










