
ప్రజాశక్తి - భీమవరం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. తాడేపల్లి నుంచి సిఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రశాంతి, జెసి రామ్సుందర్రెడ్డి, సంబంధిత అధికారులు వీడియో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 384 క్యాంపులు 43 రోజుల పాటు నిర్వహించేలా ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. క్యాంపులు విజయవంతంగా నిర్వహించేందుకు కావాల్సిన మెడిసిన్ తదితర కిట్లు వైద్య ఆరోగ్య శాఖకు చేరుకున్నాయని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు 175 మంది డాక్టర్లతో సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో, ట్రైనీ డిప్యూటీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి.మహేశ్వరరావు, డిసిహెచ్ఎస్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
గణపవరం:మండలంలోని సిహెచ్. అగ్రహారంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి చుక్క అప్పారావు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు పివి.నారాయణ పిహెచ్ఎం అన్నకుమారి, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, ఎఎన్ఎం ఏసమ్మ, ఎంఎల్హెచ్పి మాధురి పాల్గొన్నారు.
నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష
కాళ్ల : ఈ నెల 30వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు కాళ్ల మండలంలో ఉన్న 21 సచివాలయాల్లో రెండు టీమ్లుగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంపిడిఒ జి.స్వాతి శుక్రవారం తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమం నిర్వహణ గురించి ముందుగా అందరూ ప్రజాప్రతినిధులకు తెలిపేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కోరారు.
పాలకోడేరు : పాలకోడేరు మండలంలో నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ నూకల మురళీగంగాధరరావు తెలిపారు. శనివారం గొరగనమూడిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.