Jun 21,2023 21:25

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న హరిప్రసాద్‌

కడప అర్బన్‌ : కాపు బలిజల క్షేమం సంక్షేమన్ని గాలికి వదిలి జగన్‌కు భజన చేయడం పనిగా పెట్టుకున్న ముద్రగడ పద్మనాభం జగన్‌కు తొత్తుగా మాట్లాడాడని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరి ప్రసాద్‌ మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆకత్యాలను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎండ గడుతుంటే ముద్రగడ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం హరి టవర్స్‌ లో బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి నాగరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన చంద్రబాబుని విమర్శించడం తగదన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కాళ్ళ వద్ద కాపు ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన ఘనత ముద్రగడదేనని ఆరోపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాపులకు ద్రోహం చేసిన జగన్‌ పై పోరాటం చేయాలని, లేకపోతే కాపు జాతిని క్షమించదని తెలిపారు. సమావేశంలో గంధం ప్రసాద్‌, మిరియాల నరసింహులు, దండు రవిశంకర్‌ పాల్గొన్నారు.