ప్రజాశక్తి - నందవరం
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి విద్యావ్యవస్థపై చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వర రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని నాగలదిన్నె గ్రామంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను టిఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి సందర్శించారు. కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జూనియర్ కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు మాత్రమే ఉన్నారని, వారే అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారని విద్యార్థులు బీవీ దృష్టికి తీసుకొచ్చారు. కళాశాలలో అధ్యాపకుల కొరత ఉండడం వల్ల అన్ని సబ్జెక్టుల్లో పట్టును సాధించుకోలేక పోతున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత చదువులు అందించాలని టిడిపి హయాంలో మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేసి నాగలదిన్నె గ్రామంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం కళాశాలకు స్థలం కేటాయించి శాశ్వత భవన నిర్మాణానికి కూడా సన్నాహాలు చేయలేదని విమర్శించారు. తాత్కాలిక భవనానికి నాడు-నేడు కింద నిధులు మంజూరు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. కళాశాలకు శాశ్వత భవనం కేటాయించి, అధ్యాపకులను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.
కళాశాల ప్రన్సిపల్తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ