
జగన్ పతనం ప్రారంభం
- మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
- ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్కె ఫంక్షన్ హాల్ వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టిడిపి యువ నాయకులు భూమా జగత్ విఖ్యత్ రెడ్డిలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన చోటు నుండే తమ పోరాటం ప్రారంభిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎలాంటి అవకతవలు జరగలేదని, కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే ప్రతిపక్ష నేతను అరెస్టు చేసి రిమాండ్కు పంపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తన సహచర మంత్రులు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును చర్చకు రానివ్వకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డు కుంటున్నారంటే ఇంత కంటే దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. ఇలాంటి పాలన అవసరమా అని ప్రజలు తెలుసుకోవాలన్నారు. తక్షణమే నారా చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జైనాబీ, నాగార్జున, ప్రముఖ న్యాయవాది, టిడిపి నాయకులు తాతి రెడ్డి తులసి రెడ్డి, భార్గవ్ రామ్, మాజీ కౌన్సిలర్లు కొండారెడ్డి, కృపాకర్, శివశంకర్ యాదవ్, చింతల సుబ్బారాయుడు, మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.