May 18,2023 20:03

వ్యవసాయ శాఖాధికారులతో ఉన్న సీతారామిరెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనలో రైతుల వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయని వైసిపి నాయకులు, ఎమ్మిగనూర్‌ ఆర్‌టిసి డిపో ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు వై.సీతారామిరెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని బూదూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఆర్‌బికెను నిర్మించి స్థానిక రైతులకు లాభసాటి వ్యవసాయంపై సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంచుతారని చెప్పారు. ఉపాధి హామీ చట్టం కింద రూ.21.80 లక్షలతో నిర్మించిన ఆర్‌బికె పండితుల వేద మంత్రాల మధ్య రిబ్బన్‌ కట్‌ చేసి భవనంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా హాజరైన ఆయనకు స్థానిక వైసిపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ అధికారులు కూడా ఆయనకు, వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డికి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డికి, ఎంపిడిఒ ప్రభావతికి శాలువా, పూలమాలలు వేసి సన్మానించారు. ఉపాధి ఎపిఒ తిమ్మారెడ్డి, పిఆర్‌ ఎఇ నరసింహులు, ఎడిఎ మహ్మద్‌ ఖాద్రీ, ఎఒ జీరా గణేష్‌, ఎఇఒ నరసింహుడు, నారాయణ రెడ్డి, జక్కయ్య, ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజు పాల్గొన్నారు.