ప్రజాశక్తి-బొబ్బిలి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షపై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సురక్షపై ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు. మున్సిపాలిటీలో వచ్చేనెల 6న గొల్లపల్లి, 13న సంఘవీధి, 27న ఇందిరమ్మ కాలనీ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ వద్ద నిర్వహించే వైద్య శిబిరాలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఆర్ఒ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
గంట్యాడ : ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించాలని ఎంపిపి పీరుబండి హైమావతి అన్నారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఎంపిడిఒ భానోజీరావు ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఆరోగ్య సురక్ష మండల కన్వీనర్ సిహెచ్ రామసూర్యం, సిడిపిఒ ఉమాభారతి, వైద్యులు జగదీశ్వరరావు, వెంకటేష్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు పీరుబండి జైహింద్కుమార్, ఎంఇఒ వెంకటరావు పాల్గొన్నారు.
వేపాడ : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఎంపిపి డి.సత్యవంతుడు, తహశీల్దార్ ప్రసన్నకుమార్, ఎంఇఒ బాలభాస్కర్, వైద్యాధికారి ధరణి మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.
వంగర : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎంపిపి యు.సురేష్ ముఖర్జీ అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్షపై సమావేశం నిర్వహించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శశిభూషణరావు, తహశీల్దార్ డి.ఐజాక్, వైసిపి మండల నాయకులు కరణం సుదర్శనరావు, వైద్యాధికారులు సుస్మిత డయానా, జ్యోతి పాల్గొన్నారు.
లక్కవరపుకోట : సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంపిపి గేదెల శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని చందలూరు పంచాయతీలో జెసిఎస్ మండల కన్వీనర్ యడ్ల కిశోర్కుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్య సురక్షపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ జ్ఞానేశ్వరరావు, పిహెచ్సి వైద్యాధికారి పివి మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల : గ్రామాల్లో ఆరోగ్య సురక్ష సర్వే పక్కాగా జరగాలని మండల ప్రత్యేకాధికారి వి.శ్రీనివాసరావు సూచించారు. రామతీర్థం సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంచరాపు రాము, హౌసింగ్ జెఇ ఆర్.పవన్ పాల్గొన్నారు.










