ప్రజాశక్తి-పాడేరు:చింతపల్లి జ్యుడీషియల్ కోర్టులో పూర్తిస్థాయి జడ్జిని నియమించాలని గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. బోనంగి చిన్నయ్య పడాల్, జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు చింతపల్లి తహసిల్దార్కి వినతి పత్రం అందజేశారు. చింతపల్లి ప్రధమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకి వారానికి ఒకరోజు శుక్రవారం మాత్రమే పూర్తిస్థాయి కేసులు పరిశీలన జరుగుతుందని, మిగతా రోజులు నర్సీపట్నంలోనే కేసులు పరిష్కారం వాయిదాలు జరుగుతు న్నాయన్నారు.నర్సీపట్నం కోర్టుకి పూర్తిస్థాయి జడ్జి, చింతపల్లికి ఇన్చార్జి కావడంతో ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. చింతపల్లి, గూడెం, కొయ్యూరు మండలాలకు చెందిన వారంతా చింతపల్లి కోర్టుకు వస్తుంటారన్నారు. చిన్న చిన్న కేసుల్లో ఉన్న సామాన్య వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులు పడుతూ మానసిక వేదనకు గురి అయ్యే పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు.ఈ ఇబ్బందులు ఉన్నందున చింతపల్లి జ్యుడీషియల్ కోర్టుకి పూర్తిస్థాయి జడ్జిని నియమించాలని కోరారు.










