Nov 21,2023 23:57

ప్రజాశక్తి - పంగులూరు
తమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పంగులూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కొప్పోలు రమాదేవి మంగళవారం తెలిపారు. ఎస్‌జిఎఫ్ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన అండర్-17 ఖోఖో పోటీలలో తమ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా తరఫున తమ విద్యార్ధులు పాల్గొన్న జట్టు ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. వీరిలో చెన్నూరు బాజీ బాబు, నక్క భరత్ కుమార్, ఇందూరి ప్రవీణ్‌రెడ్డి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఖోఖో క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల పిడి మేకల సీతారాంరెడ్డి, పోటీలో గెలుపొందిన విద్యార్థులను హెచ్‌ఎం రమాదేవి తోపాటు ఎంఇఒ కె నాగభూషణం, జి వీరాంజనేయులు, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థి సంఘం, గ్రామస్తులు అభినందించారు. తమ పాఠశాలకు అవకాశాన్ని ఇచ్చిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి కె వనిజకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.