కడప : రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎదగాలని స్టెప్ సిఇఒ సి. సాయి గ్రేస్ అన్నారు. జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కడపలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే 13 జిల్లాలకు చెందిన బాలుర జట్లు, మహిళల జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు. హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రాజు, కడప జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు లయన్ కె. చిన్నపరెడ్డి మాట్లాడుతూ కడపలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, స్పాన్సర్స్ కంచి గోపికష్ణ, కంచి సురేంద్ర, రాజారత్నం ఐజాక్, రోడా మెర్సీ, కార్పొరేటర్ సూర్యనారాయణ, కిరణ్, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వి. శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి సింధూరి, కోశాధికారి బాబర్, సంయుక్త కార్యదర్శి బసిరెడ్డి, కిషోర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట సునీల్, కార్యవర్గ సభ్యులు, అన్ని జట్ల మేనేజర్లు, కోచ్లు, అబ్జర్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటిరోజు విజేతలు వీరే..
కడప జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పోస్ట్ అథారిటీ మైదానంలో శనివారం రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ రోజు జూనియర్ బార్సు విభాగంలో నిర్వహించిన పోటీలలో శ్రీకాకుళం జట్టుపై కడప జట్టు విజయం సాధించింది. ఈస్ట్ గోదావరి జట్టుపై వెస్ట్ గోదావరి జట్టు విజయం సాధించింది. అనంతపురం జట్టుపై ప్రకాశం జట్టు విజయం సాధించింది.
సీనియర్ మహిళల విభాగంలో చిత్తూరు జట్టుపై కడప జట్టు విజయం. కర్నూలు జట్టువై ఈస్ట్ గోదావరి జట్టు విజయం.నెల్లూరు జట్టుపై విజయనగరం జట్టు విజయం సాధించింది. అనంతపురం జట్టుపై కష్ణ జిల్లా జట్టు విజయం సాధించింది.










