ప్రజాశక్తి- పిఎం పాలెం : ఇటీవల పలు ప్రాంతాలలో నిర్వహించిన క్లస్టర్, రీజినల్ స్థాయి క్రీడా పోటీలలో 14 మంది నవోదయ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ కె.సంజరు తెలిపారు. బాలికల విభాగంలో విజేతగా నిలిచిన రేణుక బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. కబడ్డీ విభాగంలో ఫణికుమార్ ఉత్తమ క్రీడాకారుడుగా పతాకాన్ని పొందాడు. ఖోఖోలో దీప్తి, హేమలత, సృజన, రేణుక జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా, బాలుర విభాగంలో ఫణికుమార్, చిన్నికృష్ణ, కబడ్డీలో, రాజేష్, హరిప్రసాద్, మోహన్ ఖోఖోలో, పవన్సాయి, నరేష్, విష్ణు వాలీబాల్లో, రామచరణ్ హేండ్బాల్లోను రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు రమణమ్మ, నీలాప్రసాద్ను ప్రిన్సిపాల్ అభినందించారు. వీటితో పాటు క్లస్టర్ స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో చిత్రలేఖనం, శిల్పం విభాగాలలో ప్రథమ, తృతీయ బహుమతులు పొందిన దక్షిత, పూజితలను కూడా అభినందించారు.










