
జాతీయ రహదారి భూ సేకరణ ను వ్యతిరేకిస్తూ పేద రైతులు వంటావార్పు.
పేదల భూముల్లోకి సర్వేకు వస్తే అధికారులను అడ్డుకుంటాం.
ప్రత్యామ్నాయ భూముల్లో రహదారి వేయండి
సిపిఎం జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల నుండి జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణం కోసం పేదల భూముల్లోకి సర్వేకు వస్తే బాధిత రైతుల తో కలిసి అధికారులను అడ్డుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం నంద్యాల నుండి జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణం కోసం కానాల, రైతు నగరం గ్రామాల్లో పేద రైతుల భూములను తీసుకోడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిపిఎం పార్టీ ల ఆధ్వర్యంలో రెండు గ్రామాలకు చెందిన బాధిత రైతులు తమ భూముల్లో శిభిరం వేసుకొని, అక్కడే వంటా వార్పు చేసుకోని తిని దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా పేద రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ధనవంతులు, అధికార పార్టీ నాయకులు, రియల్ఎస్టేట్ వ్యాపారస్తుల ఆస్తులు కాపాడడం కోసం, వారి భూములకు విలువ పెంచేందు కోసం జాతీయ రహదారి భూసేకరణ కు మొదట్లో ప్రతిపాదించిన ప్లాను మార్చి నిరుపేదలమైన తమ భూముల్లో రహదారి వచ్చే విధంగా గెజిట్ రూపొందించారని, ఈ గజిట్ వల్ల మా జీవనోపాధి, ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందన్నారు.మా అభ్యంతరాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఏమాత్రం లెక్కచేయకుండా మా పొలాల్లో సర్వే చేసి మార్కింగ్ వేస్తున్నారని వాపోయారు.ఇది చాలా అన్యాయం అని తమ ఆవేదనను వెల్లుబుచ్చారు. సిపిఎం పార్టీ, రైతు సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ నాగరాజు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ భూముల్లో జాతీయ రహదారి వేయడానికి అవకాశం ఉన్న , రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామసభలు జరుపుకున్న, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా , పేద రైతుల భూముల్లో సర్వే చేయడానికి తాము వ్యతిరేకిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఉంటే వెంటనే కానాల రైతు నగరం గ్రామాల్లో గ్రామ సభలు జరిపి, రైతుల అభిప్రాయాలను తెలుసుకొని, పేద రైతులకు తక్కువ నష్టం కలిగే విధంగా ప్రత్యామ్నాయ భూముల్లో రహదారిని నిర్మించి పేద రైతులకు న్యాయం చేయాలని కోరారు. అట్లా జరగని పక్షంలో రైతుల అందరితో కలిసి సర్వే పనులను అడ్డుకుంటామని, సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆ భూముల్లోనే దీక్షలో ఉంటామని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే , ఎంపీ జోక్యం చేసుకొని పేద రైతులకు న్యాయం జరిగేలా చర్య తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో , జిల్లా సహకార దర్శి బాల వెంకట్, టౌన్ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు లక్ష్మణ్, శివ , ఎస్ఎఫ్ఐ నాయకులు నిరంజన్, కిరణ్ గార్లతోపాటు కానాల, రైతు నగరం గ్రామ రైతులు శంకరరావు, మనోహర్, టి వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, రామ చిన్నమ్మ,, శర్మ తదితరులు పాల్గొన్నారు.










