ప్రజాశక్తి - ఏలూరు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న ఇవిఎం యంత్రాలు, వివిప్యాట్ భద్రపరచు గొడౌన్ను రెవెన్యూ, ఎన్నికల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇవిఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఇవిఎం, వివిప్యాట్ గొడౌన్ను క్షుణ్నంగా తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గొడౌన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల తీరును పరిశీలించి అవసరమైన సూచనలను సంబంధిత అధికారులకు, సిబ్బందికి జారీ చేశారు. గొడౌన్ వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీస్తూ ఇవిఎం గొడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది లక్ష్మీనారాయణ, రాజేష్ ఉన్నారు.










