ప్రజాశక్తి-అద్దంకి: విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అద్దంకి సీనియర్ సివిల్ జడ్జి బి బాబు నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ రోడ్డులో గల గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి బి బాబు నాయక్ హాజరై మాట్లాడారు. గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రస్తుత సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. మీరు కూడా అవకాశాలను అందిపుచ్చుకొని మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా ఎదగాలని కోరారు. గురుకుల పాఠశాలలో క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఆహారం పరిశుభ్రంగా ఉండాలని, తాగునీరు వృథా చేయరాదని సూచించారు. విద్యార్థులకు ప్రాథమిక హక్కులు, విధుల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాదెండ్ల హరిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పాఠశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం, వార్డెన్ నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.










