ప్రజాశక్తి - మంత్రాలయం
నందవరం తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కరణం జనార్ధన్ రావు ఇంట్లో చోరీ కోసం ఇంటి తలుపులకు దొంగలు నిప్పు పెట్టిన సంఘటన మంత్రాలయంలో చోటు చేసుకుంది. మంత్రాలయానికి చెందిన ఇంటి యజమాని జనార్ధన్ రావు స్థానిక మాధవరం వెళ్లే రహదారిలో శ్రీవైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనుక నూతనంగా ఇంటిని నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. దసరా సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి నరసింహ స్వామి దర్శనార్థం సోమవారం అహోబిలం వెళ్లారు. నిర్మానుష ప్రదేశం కావడంతో దొంగతనం చేయాలని భావించి దొంగలు ఇంటి తలుపులకు నిప్పు పెట్టారు. అదే సమయానికి జనార్ధన్ రావు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులకు మంటలు చెలరేగుతున్నాయని నీటితో మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి కాలిన తలుపుల ఫొటోలు తీసుకెళ్లారు. గురువారం పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు జనార్ధన్రావు తెలిపారు. గ్రామానికి చివరి ప్రాంతంలో ఇల్లు ఉండడంతో చోరీకి ప్రయత్నించారని, సరైన సమయంలో రావడం వల్ల ఎలాంటి నష్టమూ జరగలేదని తెలిపారు. ఆలస్యంగా వచ్చి ఉంటే కచ్చితంగా ఇంట్లో దొంగతనం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిఘా పెట్టి పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గస్తీ ఏర్పాటు చేయాలని కోరారు.
తలుపులకు నిప్పు పెట్టిన దుండగులు