
* శాసనసభ స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి- పొందూరు : నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ధ్యేయమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని పెనుబర్తి, అలమాజీపేట, ఖాజీపేట గ్రామాల్లో జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా కుళాయిల ఏర్పాటుకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్లో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మహాయజ్ఞంలా చేపట్టామన్నారు. నియోజకవర్గంలో పలుచోట్ల ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని అన్నారు. మరికొన్ని చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. యుద్ధప్రాతిపతికన పనులు చేపట్టి ప్రజల ముంగిటకు తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగ క్షేమాలను, సమస్యలను తెలుకుని తక్షణ పరిష్కారం చేపట్టేందుకు వీలుగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తమ్మినేని ఝాన్సీ, ఉప సర్పంచ్ పొన్నాడ సత్యం, వైసిపి మండల అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్ బాడాన సునీల్ కుమార్, వైసిపి మండల జెసిఎస్ బాడాన వెంకట కృష్ణారావు, స్థానిక నాయకులు తమ్మినేని మురళి, చింతాడ సత్యప్రసాద్, బొడ్డేపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.
బూర్జ: మండలం కాఖండ్యాంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ముద్రించి పోస్టర్లను అందజేశారు. ఇందులో భాగంగా సమస్యను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కర్నెన నాగేశ్వరరావు, జెడ్పిటిసి బెజ్జిపురపు రామారావు, వైసిపి మండల అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, వైస్ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, డిసిఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు, పిఎసిఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు సురపు ఉదరు,సర్పంచ్లు కె.రామకృష్ణ, కె.గోవిందరావు పాల్గొన్నారు.