Sep 15,2023 20:36

జగన్న ఆరోగ్య సురక్షలో భాగంగా మహిళతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

       సోమందేపల్లి : ప్రభుత్వం చేపట్టిన జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అన్ని గ్రామాల్లోనూ ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నట్లు కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు తెలిపారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని 2వ వార్డు సాయి నగర్‌లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. వాలంటీర్ల ద్వారా నమూనా ప్రశ్నపత్రం, వాలంటీర్స్‌ అవుట్‌ రీచ్‌ ప్రొఫార్మాను ఎలా భర్తీ చేస్తున్నారన్న విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఇంటినీ, ప్రతి కుటుంబాన్నీ ఆరోగ్యపరంగా ఉంచే కార్యక్రమమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్ధేశమని తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టేందుకోసం ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లాలన్నారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్‌ ఫోన్‌లో డౌన్లోడ్‌ చేయించాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా నిర్వహించే ఇంటింటి కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే వ్యాధుల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇక వినాయక చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్‌ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, పెనుకొండ, ఎపిపిసిబి ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పివి. కిషోర్‌ రెడ్డి, ఎపిపిసిబి ఎఈఈ కృష్ణా రెడ్డి, డిఎంఅండ్‌ హెచ్‌ఒ ఎస్‌వి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.