నగరడోన జగనన్న కాలనీలో పర్యటిస్తున్న అధికారులు
ప్రజాశక్తి - చిప్పగిరి
జగనన్న కాలనీలో ఇంటి పట్టా పొందిన ప్రతి లబ్ధిదారుడూ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ సుధాకర్ రాజు కోరారు. మంగళవారం నగరడోన, రామదుర్గం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు బాలన్న, సిసింద్రీ ఆధ్వర్యంలో అధికారులందరూ జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తోందని తెలిపారు. బేస్ మట్టం వేయని లబ్ధిదారులు కూడా త్వరగా పూర్తి చేసుకునేటట్లు అవగాహన కల్పించాలని హౌసింగ్ అధికారులకు, సచివాలయ అధికారులకు సూచించారు. ఎపిఎం నాగార్జున, హౌసింగ్ ఎఇ భవ్య పాల్గొన్నారు.










