ప్రజాశక్తి-చీరాల: ఉమెన్స్డే సెలబ్రేషన్స్ చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్సాహంగా జరిగాయి. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కళాశాలలో విద్యార్థినులు, మహిళా అధ్యాపకులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మహిళా దినోత్సవ విశిష్టతను తెలిపే విధంగా డ్రాయింగ్ పోటీలను ఏర్పాటు చేశారు. అందులో మహిళల గొప్పదనం, త్యాగం, ధైర్యం తెలిపేలా విద్యార్థులు వేసిన చిత్రలేఖనాలు ఆకట్టుకున్నాయి. మహిళల గొప్పతనాన్ని చాటేలా చేసిన కార్యక్రమంలో విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు ఆలోచింపచేశాయి. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానం కార్యక్రమంలో మానసిక వికాస నిపుణులు పెర్లి సందీప్ మాట్లాడుతూ ఒత్తిడి సహజమైన ఈ రోజుల్లో దానిని అధిగమించటం అలవాటు చేసుకోవాలన్నారు. మనకు మంచే జరుగుతుందని నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోవటంతో వలనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, వీటికి దూరమై పాశ్చాత్య సంస్కతికి దగ్గరవుతున్నామని, అందుకే ఈ పరిస్థితి వస్తుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ మహిళ లేనిదే సమాజం లేదన్నారు. భారతీయ సమాజంలో మహిళకు ఎంతో గౌరవం ఉందన్నారు. ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనన్నారు. ప్రతి విద్యార్థి అమ్మను గౌరవించలన్నారు.అపుడే సమాజం విలువలతో ఉంటుందన్నారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ మహిళా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఐఎంఎ కార్యదర్శి శ్రీకాంత్, సీఎస్ఇహెచ్ ఓడి సౌజన్య, గంగాభవాని, వివిధ విభాగాధిపతులు ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు.










