Aug 05,2022 23:32

సమావేశంలో మాట్లాడుతున్న భరత్‌గుప్త

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : లబ్ధిదారులకు మంజూరు చేసిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.భరత్‌ గుప్త సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాధన్‌తో కలిసి పేదలందరికి ఇళ్లు పథకంపై హౌసింగ్‌ అధికారులలో సమావేశం నిర్వహించారు. జోనల్‌ కమిషనర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన లబ్ధిదారులందరికీ నిర్మాణం శత శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లే-అవుట్ల వద్ద ఇళ్ల నిర్మాణ సమయంలో ఇసుక, సిమెంట్‌, స్టీల్‌ తదితర సామాగ్రి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట గోడౌన్లు ఏర్పాటు చేసుకొని సామగ్రిని భద్రపరుచుకోవాలన్నారు. జలజీవన్‌ మిషన్‌ అమలు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్‌, జోనల్‌ కమినర్లు, డిఇలు, ఎఇలు, తదితరులు పాల్గొన్నారు.