
ప్రజాశక్తి-అనకాపల్లి
రైతు భరోసా, పిఎం కిసాన్ ఈకేవైసీ చెల్లింపుల్లో జరిగిన వైఫల్యాలను రెండు మూడు రోజుల్లో రైతు భరోసా కేంద్రం సిబ్బందిని సంప్రదించి ముఖ గుర్తింపు, ఆధార్ సీడింగ్, ఎన్పీసీఐ లింకేజీ సరిచేసుకొని రైతులు ఖాతాల్లో నగదు జమ అయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి సూచించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రవి, చిక్కాల రామారావు మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణలో సిహెచ్ యాప్లో రైతుల నమోదు ప్రక్రియ, 14వ విడత పిఎం కిసాన్కు ఇంకా 28,020 మంది ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. 2,875 మంది కౌలు రైతులకు కౌలు రైతు హక్కు పత్రాలను ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. జగనన్న పాల వెల్లువ పథకంలో ఎక్కువ యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా చూడాలని రామారావు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జాహ్నవి, మత్స్యశాఖ, జిల్లా ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, నీటిపారుదల శాఖ, ఏపీఎంఈపి, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.