ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: ఈయస్ఐ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇఎస్ఐ ప్రాంతీయ కార్యాలయం ఇన్ఛార్జి రీజనల్ డైరెక్టర్ ఎ.వేణుగోపాల్ అన్నారు. ఈయస్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమం తాడేపల్లిలోని మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జి రీజనల్ ఢైరెక్టర్ వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇయస్ఐలో సభ్యులుగా ఉన్న వారు ఎన్నో సేవలను ఇఎస్ఐ కల్పిస్తుందని వాటి పట్ల అవగాహణ కలిగి ఉండి వినియోగించుకోవాలన్నారు. ఈయస్ఐ అందిస్తున్న సేవలను తెలియజేసేందుకు మార్చి 10వ తేదీ వరకు పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అవగాహనా సదస్సులు, వైద్య సదస్సులు, శుభ్రత, పరిశుభ్రత గురించి తెలియచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న పరిశ్రమలు, సంస్థల్లోని భీమాదారులు వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవలంభించాల్సిన జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈయస్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ వి.శ్యామ్ప్రసాద్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.










