Oct 22,2023 22:52

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ గ్యాస్‌ డెలివరీ బార్సు అండ్‌ వర్కర్స్‌కు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వర్తింప చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గ్యాస్‌ డెలివరీ బార్సు అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రథమ మహాసభ ఆదివారం కొవ్వూరులో జరిగింది. ఈ మహసభకు యూనియన్‌ నాయకులు ఎస్‌కె ఉస్మాన్‌, వి.దుర్గారావు మహమ్మద్‌ రసూల్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పతాకాన్ని యూనియన్‌ సీనియర్‌ నాయకులు ఎర్ర శ్రీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుందరబాబు, రాజులోవ మాట్లాడుతూ గ్యాస్‌ డెలివరీ బార్సుగా పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. అనేక సంవత్సరాలుగా కార్మికులుగా పనిచేస్తున్న ఇఎస్‌ఐ, పిఎఫ్‌ అమలు చేయకుండా యాజమాన్యాలు వెట్టిచాకిరి చేస్తున్నాయని అన్నారు. చట్టబద్ధంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. పనిలో ఉండగా ప్రమాదం జరిగితే యజమాని బాధ్యత తీసుకొని వైద్యం చేయించాలని, రిటైర్‌ అయిన కార్మికులకు గ్రాడ్యుటి ఇవ్వాలన్నారు. యూనియన్‌ నాయకులు గంటి కృష్ణ, కెవిపిఎస్‌ నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ నూతన తూర్పుగోదావరి జిల్లాలో 47 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయని, సుమారుగా 800 మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారని, వీరికి కార్మిక చట్టాలు అమలయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.
నూతన జిల్లా కమిటీ ఎన్నిక
తూర్పుగోదావరి జిల్లా గ్యాస్‌ డెలివరీ బార్సు మరియు వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఎం.సుందరబాబు, జిల్లా అధ్యక్షులుగా వి.దుర్గారావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంటి కృష్ణ, కోశాధికారిగా నసూర్‌ ఉల్లా ఖాన్‌, ఉపాధ్యక్షులుగా గుమ్మాపు దానియేలు, సహాయ కార్యదర్శిగా ఎస్‌కె.ఉస్మాన్‌, కమిటీ సభ్యులుగా షేక్‌.హబీబుల్లా షరీఫ్‌, ఎర్ర శ్రీనుతోపాటు మొత్తం 11 మందితో నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.