Nov 08,2022 23:15

  • ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : ఇ-వేస్ట్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు) భవిష్యత్‌పై తీవ్ర దుష్పృభావం చూపుతాయని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఇ-వేస్ట్‌ నిర్వహణపై శ్రీ దుర్గామల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల, జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సంయుక్తం ఆధ్వర్యాన మంగళవారం కళాశాల సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కలెక్టర్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణలో అవగాహన పెంచుకుని కాలుష్య నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలైన కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, సిడిలు, బ్యాటరీలు, ఎల్‌ఇడి బల్బులు వంటి వస్తువులు పర్యావరణానికి హాని కలిగిస్తాయన్నారు. ఇవి పాడైనప్పుడు చెత్తకుండీలు, డ్రైనేజిలలో వేయకూడదన్నారు. అలా వేస్తే అవి సమీపంలోని కాల్వల ద్వారా నదులు, సముద్రంలో కలిసి జలచరాలు కాలుష్యానికి గురవుతున్నాయని, వాటిని ఆహారంగా తీసుకునే ప్రజలు కాలుష్యకోరలకు చిక్కుతారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలలో ఉండే లెడ్‌, కార్డియం, మెర్క్యురీ వంటి రసాయన పదార్థాల వలన కలిగే అనర్థ్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈసదస్సులో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ జి.సమరం, సిద్దార్థ మహిళ కళాశాల డైరెక్టర్‌ టి.విజయలక్ష్మి, ప్రిన్సిపల్‌ ఎస్‌.కల్పన పాల్గొన్నారున.
అఘాయిత్యానికి గురైన చిన్నారికి కలెక్టర్‌ పరామర్శ
చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడుని కఠినంగా శిక్ష పడేలా చూస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. అఘాయిత్యానికి గురై పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన చిన్నారిని మంగళవారం కలెక్టర్‌ ఎస్‌డిల్లీరావు పరామర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అభంశుభం తెలియని చిన్నారిపై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఇటువంటి సంఘటన జరగడం మనసును కలిచివేస్తోందన్నారు.