Aug 17,2023 20:09

పంట నమోదును పరిశీలిస్తున్న ఎఒ శివ శంకర్‌

ప్రజాశక్తి - హాలహర్వి
ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన ప్రతి పంటనూ ఈ-క్రాప్‌ నమోదు చేసుకోవాలని ఎఒ శివశంకర్‌ సూచించారు. గురువారం ఆయన హాలహర్వి మండలం గూళ్యం గ్రామం 1, 2, 3 రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సీజన్‌లో వేసిన పంటలను జియో ట్యాగ్‌ ద్వారా ఈ-క్రాప్‌ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ-క్రాప్‌ నమోదు చేయకపోతే ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు, రైతు భరోసా, ఇన్స్యూరెన్స్‌ వర్తించవని తెలిపారు. ఈ-క్రాప్‌ నమోదుకు ప్రతి రైతూ సహకరించాలని కోరారు. ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన ప్రతి రైతూ ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం, సర్వే నెంబర్లు తదితర వివరాలు ఈ-క్రాప్‌ యాప్‌లో పొందుపరుస్తారని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పంటల బీమా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే రైతు పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఈ-క్రాప్‌ నమోదు చేసుకోవాలని సూచించారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ మనోజ్‌ పాల్గొన్నారు.