హథీరాంజీ మఠం ఆస్తులను కాపాడాలి: బాబురావు చౌహాన్
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): బంజారా సంతతికి చెందిన సంత్ శ్రీ హథీరాం బావాజీ మఠంకు సంబంధించిన ఆస్తులను అక్రమంగా దోచుకుంటున్నారని, మఠంలో ఎన్నో కుంభకోణాలు జరుగుతు న్నాయని అఖిల్ భారత్ బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి బాబురావు చౌహాన్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యావత్ భారత దేశంలో బంజారాలు ఒకే భాష, ఒకే సంస్కతి, ఒకే సంప్రదాయాలను కలిగి ఉన్నారని, దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది బంజారా జనాభా ఉన్నారన్నారు. మఠంకు సంబంధించిన ఆస్తులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత నేడు ఏర్పడిందని, అన్యాక్రాంతం అవుతున్న ఆస్తులను పరిశీలించడానికి తిరుపతి వచ్చానన్నారు. హాథిరాం బావాజీ మఠం ఆస్తులను రక్షించి బంజారాల సాధువులకు, బంజారా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.










