Jun 26,2023 21:27

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి అన్బురాజన్‌

 కడపఅర్బన్‌ నగరంలోని సంధ్య సర్కిల్‌ వద్ద పట్టపగలు జరిగిన వైసిపి నాయకుడు శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌పి అన్బురాజన్‌ తెలిపారు. సోమవారం పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార లావాదేవీలే హత్యకు కారణంగా తెలిసిందన్నారు. అరెస్టు అయిన వారిలో పెండ్లిమర్రి మండలం, కొండూరుకు చెందిన మోపురి ప్రతాప్‌రెడ్డి, కడప సాయిపేట చెందిన మెరువ శ్రీనివాసులు, పాత కడపకు చెందిన కల్లూరు సురేష్‌ కుమార్‌ అలియాస్‌ ఫ్రాన్సిస్‌, పిఎస్‌ నగర్‌కు చెందిన హరిబాబు, శంకరాపురానికి చెందిన కోనేరు వెంకటసుబ్బయ్య, పాత కడపకు చెందిన పత్తురు భాగ్యరాణి ఉన్నారని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసును సత్వరమే ఛేదించిన కడప డిఎస్‌పి షరీఫ్‌, సిఐలు నాగరాజు, అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో డిఎస్‌పి షరీఫ్‌, సిఐలు నాగరాజు, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.