ప్రజాశక్తి-మార్టూరు రూరల్: హర్షిణి కళాశాలల్లో విద్య అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి రానున్న రోజుల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అన్నారు. సోమవారం మార్టూరులోని కళాశాల ప్రాంగణంలో హైదరాబాద్, చెన్నైకి చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రాంగణ ఎంపిక నిర్వహించారు. విప్రో, ఎన్సిఆర్ టెక్నాలస్, 3ఐ ఇన్ఫోటెక్ కంపెనీలు పాల్గొని కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రవి కుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఎంపికయిన 14 మంది విద్యార్థు లను హర్షిణి చైర్మన్ గోరంట్ల రవికుమార్, కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం ఆంజనేయులు అభినందించారు. అధ్యాపకులు జి లక్ష్మీనారాయణ, రమణాచార్యులు, బోసుబాబు, సురేష్, షేక్ నాగూర్వలి, టి సంధ్యారాణి పాల్గొన్నారు.










