Nov 04,2023 17:08

ఎంఇకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
మండలంలోని హనవాల్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతులు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. శనివారం ఎంఇఒ శివరాములుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 9, 10వ తరగతులు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి ఉందని తెలిపారు. అధికారులు స్పందించి 9, 10వ తరగతులు నిర్వహించాలని కోరారు. ప్రతేడాది 8వ తరగతి పూర్తి చేసే విద్యార్థులు వంద మందికి పైగా ఉంటున్నారని తెలిపారు. వారు ఉన్నత చదువులు చదవాలంటే తరగతి లేక వేరే గ్రామానికి వెళ్లి చదువుకోవాలంటే సరైన రవాణా సౌకర్యం లేక మధ్యలోనే చదువు మానేస్తున్నారని చెప్పారు. వెంటనే స్పందించి 9, 10వ తరగతులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులను కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్‌ కుమార్‌, దినేష్‌, నాగరాజు, రవితేజ, రాజు, గణేష్‌, శశి, మౌనేష్‌ పాల్గొన్నారు.