Jan 13,2023 23:55

మాట్లాడుతున్న టిడిపి నాయకులు అయ్యన్నపాత్రుడు తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలన హిట్లర్‌ పాలనను మించిపోయిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గవరపాలెం మళ్ల జగన్నాథం కళ్యాణ మండపంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అధ్యక్షతన టిడిపి సోషల్‌ మీడియా శిక్షణా కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ సోషల్‌ మీడియా వేదికగా వైసిపి పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. అవినీతిపై పోరాటంలో యువతదే కీలక పాత్ర అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి జారీ చేసిన బ్రిటిష్‌ ప్రభుత్వం కాలం నాటి జీవో నెంబర్‌ -1పై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అవినీతి శాఖ మంత్రిగా మారారన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ, కొణతాల రత్న కుమారి, బిఎస్‌ఎంకె జోగి నాయుడు, సబ్బవరపు గణేష్‌, పోలవరపు త్రినాథ్‌, నర్సీపట్నం మున్సిపల్‌ కౌన్సిలర్‌ చింతకాయల రాజేష్‌, కర్రి బాబీ తదితరులు పాల్గొన్నారు.