* చంద్రబాబుని అరెస్టు చేయాలి
* వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
ప్రజాశక్తి - నరసన్నపేట: తన అధికార దాహం తీర్చుకోవడం కోసం చంద్రబాబు ఎంతమందినైనా బలి తీసుకుంటారని ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేటలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. పుంగనూరులో పోలీసులపై దాడికి ముమ్మాటికీ చంద్రబాబే కారకుడని, ఈ కేసులో అతనే ప్రథమ ముద్దాయి అని అన్నారు. హింసాత్మక రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. పుంగనూరు ఘటనలో రాజకీయ లబ్ధి పొందాలనేది బాబు రాజకీయ పన్నాగమని చెప్పారు. ఈ ఘటనలో 50 మంది పోలీసులకు తీవ్ర గాయాలై, ఒక కానిస్టేబుల్కు కన్నుపోయిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబుపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తపై ఒక పోలీసు మహిళా అధికారి చేయి చేసుకున్నారని రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తన దత్త తండ్రికి మద్దతుగా నిలవడానికి తన సొంత తండ్రి పనిచేసిన పోలీసు శాఖలో సాటివారికి గాయాలైనా నోరుమెదపరా అని నిలదీశారు.










