ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ రిఫైనరీ హిందీ భాషను అమలు చేయడంలో ప్రథమ స్థానంలో నిలిచింది. విశాఖ నగరంలోని పది ప్రభుత్వ రంగ సంస్థల్లో అందరికంటే అగ్రభాగాన ఉంది. ఈ రాజభాష గౌరవ్ సమ్మాన్ (టోలిక్ అవార్డు)ను కేంద్ర హోం మంత్రిత్వశాఖ, రాజ భాష విభాగం సహాయ సంచాలకులు నరేంద్ర సింగ్ మెహరా నుంచి హెచ్పిసిఎల్ సిజిఎం అండ్ హెచ్ఆర్ కె.నగేష్ స్వీకరించారు. పట్టణ అధికార భాష అమలు కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఫోర్పాయింట్ షెరటాన్ హోటల్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఈ టోలిక్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ వరుసగా ఐదో సారి ఈ అవార్డును హెచ్పిసిఎల్ సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు.
సంస్థలో హిందీ భాష అమలుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, చొరవ చూపడం జరుగుతోందన్నారు. ఈ అవార్డును సాధించడం తమపై మరింత బాధ్యత పెరిగినట్లయిందన్నారు. కార్యక్రమంలో విశాఖ స్టీల్ప్లాంట్ సిఎమ్డి అతుల్ భట్ పాల్గొన్నారు.










