ప్రజాశక్తి-అనకాపల్లి : మున్సిపల్ కార్మికులు ఐదు రోజులపాటు సమ్మె పోరాటాల ద్వారా సాధించుకున్న రూ.6వేలు హెల్త్ అలవెన్స్ రికవరీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించాలని కోరుతూ శనివారం జివిఎంసి అనకాపల్లి జోనల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఇచ్చిన ఆరు నెలల అలవెన్స్ రూ.36వేలు కార్మికుల జీతాల నుంచి రికవరీ చేయాలని జీవో జారీ చేయడం దారుణమన్నారు. ఈ జీవోను ఉపసంహరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హెల్త్ అలవెన్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు యేసు రాజు, గోవిందు, బొమ్మల రాము, అజరు, వాసు, నూకరాజు, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.










