
ప్రజాశక్తి -ములగాడ : జివిఎంసి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఏడు నెలల నుంచి రావాల్సిన హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలని జివిఎంసి 58, 59, 60 ప్యాకేజీ కార్మికులు వార్డు ఆఫీసు వద్ద నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు, సిఐటియు మల్కాపురం జోన్ కార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను అధికారులు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. గత నెలలో అన్ని సెక్షన్ కార్మికులు సమ్మె చేస్తే 15 రోజుల్లో హెల్త్ అలవెన్స్, పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. ఆగస్టు నెల జీతం కొంత మంది కార్మికులకు పడలేదని, ప్రతి నెలా ఇలా మిస్సింగ్ జరుగుతుందో అధికారులు చెప్పాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో కె.రమణ, సూరిబాబు, రాము, మురళీరాజు, లక్ష్మణ, గంగులు, అప్పారావు, లక్ష్మి, రవణమ్మ, రాజేశ్వరి తదితర్లు పాల్గొన్నారు.