
ప్రజాశక్తి - తణుకు రూరల్
హెచ్ఐవి బాధిత చిన్నారులకు ఉచితంగా పోషకాహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని తణుకు ఎఆర్టి సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పి.రాజరాజేశ్వరి అన్నారు. తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఎఆర్టి సెంటర్లో బాధిత చిన్నారులకు పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావు సౌజన్యంతో బుధశారం పోషకాహారం అందించారు. ఈ సందర్భంగా ఎఆర్టి సెంటర్ వైద్యాధికారి సుంకవల్లి రామకృష్ణ మాట్లాడుతూ మల్లిన రామచంద్రరావు సంవత్సరకాలంగా ప్రతి నెలా ఈ పోషకాహారంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని, ఈ సందర్భంగా రామచంద్రరావు సేవలను కొనియాడారు.
ఏలూరు జిల్లాకు చెందిన ఎం.మణెమ్మ గతేడాది సెప్టెంబర్లో ఉపాధి నిమిత్తం దుబారు వెళ్లింది. డిసెంబరులో ఆమెకు టిబి సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఇండియా ఎంబసి ద్వారా ఈ నెల 3వ తేదీన మణెమ్మకు తోడుగా ఒక నర్స్ను పంపారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు ఎవరూ లేరని తెలుసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళను తణుకు నుంచి డాక్టర్ రామకృష్ణ హైదరాబాద్ వెళ్లి వారిని రిసీవ్ చేసుకుని వైద్య సేవలందిస్తూ మాచవరంలోని సెంట్ ఆన్స్ లోయోలా ప్రేమ నివాసం హాస్టల్లో చేర్చారు. ఈ సందర్భంగా సెంటర్ వైద్యాధికారి సుంకవల్లి రామకృష్ణను ఆ విభాగ ఉద్యోగుల ఆధ్వర్యంలో జిల్లా ఐసిటిసి సూపర్వైజర్ ఎ.హరనాధ్, షేర్ ఇండియా ప్రాజెక్టు ఆఫీసర్ జి.జగదీష్ ఘనంగా సత్కరించారు.