Jan 28,2023 23:23

గొట్టిపల్లి హైస్కూల్‌లో వర్క్‌బుక్‌లను పరిశీలిస్తున్న డైట్‌ బృందం

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం గొట్టిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్‌ మాణిక్యంనాయుడు, మానిటరింగ్‌ అధికారి శ్రీనివాసరావు, డైట్‌ లెక్చరర్‌ గొట్టేటి రవితో కూడిన జిల్లా పరిశీలన బృందం శనివారం సందర్శించింది. అన్ని తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలను వారు పరిశీలించారు. ఎక్కువ తరగతులలో సిలబస్‌ సకాలంలో పూర్తిగా కాకపోవడాన్ని గుర్తించి ప్రశ్నించారు. ప్రాథమిక తరగతులలో వర్క్‌ బుక్స్‌ సకాలంలో విద్యార్థులు పూర్తి చేయకపోవడాన్ని, పిల్లల వర్క్‌బుక్స్‌ను సకాలంలో ఉపాధ్యాయులు పరిశీలించక పోవడానికి గుర్తించారు. దీనిపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమం అమలు తీరులను పరిశీలించారు. రెండు నెలల నుంచి విద్యార్థుల స్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయులందరూ టీచింగ్‌ నోట్స్‌ రాయడాన్ని గమనించి ప్రశంసించారు. పాఠశాలలో జరిగే అకడమిక్‌ కార్యక్రమాలన్నింటినీ ప్రధానోపాధ్యాయులు సమర్థవంతంగా పర్యవేక్షించాలన్నారు.
పదవ తరగతి విద్యార్థుల స్థాయిలను పరిశీలించారు. మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను ప్రోత్సహించారు.