Feb 20,2023 00:31

ఆవిర్భావదినోత్సవంలో మాట్లాడుతున్న సిఎమ్‌డి అతుల్‌భట్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఉక్కునగరంలోని ఉక్కు క్లబ్‌ మల్టీ పర్పస్‌ హాల్‌లో డైరెక్టర్లు, కమాండెంట్‌లతో కలిసి సిఎమ్‌డి అతుల్‌భట్‌ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉక్కునగరం పాఠశాలల విద్యార్థులు స్వాగత నృత్యంతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం సిఎమ్‌డి అతుల్‌భట్‌ మాట్లాడుతూ, అద్భుతమైన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లాంట్‌ నిర్మాణంలో త్యాగజీవులను, ఉక్కు కర్మాగార స్థాపనలో పాల్గొన్న వారందరినీ కృతజ్ఞతతో స్మరించుకుందామన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ను అత్యంత ప్రాధాన్య ఉక్కు కంపెనీగా మార్చే సంప్రదాయాన్ని కొనసాగించే గొప్ప బాధ్యత మనందరి భుజాలపై ఉందన్నారు. సిబ్బంది అభిరుచి, అంకితభావం, స్ఫూర్తితో ఆర్‌ఐఎన్‌ఎల్‌ జెండాను మరింత ఎత్తుకు ఎగిరేలా చేయగలమన్న ధీమా తనలో ఉందని పేర్కొన్నారు. 2023ని ఆర్‌ఐఎన్‌ఎల్‌కు మరపురాని సంవత్సరంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు. కంపెనీ మరింత అభివృద్ధి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి మనల్ని మనం పునరంకితం చేసుకుందామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 20న రెండు బ్లాస్ట్‌ పర్నేస్‌ల నుంచి 16,250 టన్నుల రోజువారీ ఉత్తమ ఉత్పతి, బిఎఫ్‌ 1,2 నుంచి ఉత్తమ నెలవారీ హాట్‌మెటల్‌ ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాధించిన సిబ్బందిని ప్రశంసించారు. జనవరిలో 108 శాతం సామర్థ్య వినియోగంతో, ఎక్స్‌పాన్షన్‌ మిల్స్‌ నుంచి ఉత్తమ నెలవారీ ఉత్పత్తి అయిన ఫినిష్డ్‌ స్టీల్‌ మొదటి సారిగా రేటింగ్‌ రేట్‌ కెపాసిటీని దాటిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ లోని రాయబరేలీలో ఫోర్జ్‌ ్డ వీల్‌ ప్లాంట్‌ నుంచి భారతీయ రైల్వేకి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లోకో, ఎల్‌హెచ్‌బి చక్రాలను కఠినమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నందుకు సిబ్బందిని ప్రశంసించారు.
ఆర్‌ఐఎన్‌ఎల్‌ సమిష్టి అంకితభావంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులు వచ్చాయన్నారు. వరుసగా నాలుగోసారి నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ అవార్డు, 2017 నుంచి వరుసగా ఆరోసారి ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డును వరించినట్లు తెలిపారు. గోద్రేజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌, గ్రీన్‌టెక్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అవార్డు 2022 కార్పొరేట్‌ గవర్నెన్స్‌ రంగాలలో అద్భుతమైన పనితీరుకు, పరిశ్రమ, రంగాలలో అసాధారణమైన వృత్తిపరమైన విజయాలు సాధించినందుకు 16వ ఐసిఎఐ అవార్డులలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) వివి.వేణుగోపాలరావుకు ఐసిఎఐ అవార్డు, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్వాలిటీ కంట్రోల్‌ సర్కిల్స్‌ 2022, ఇండోనేషియాలోని జకార్తాలో లీన్‌ క్వాలిటీ సర్కిల్‌ టీమ్‌ల ద్వారా 3 ప్రతిష్టాత్మక గోల్డ్‌ అవార్డులు, క్యుసిఎఫ్‌ఐ ద్వారా క్వాలిటీ కాన్సెప్ట్‌లపై చాప్టర్‌ కన్వెన్షన్‌-2022లో 'గోల్డ్‌ అవార్డ్స్‌' సాధించినందుకు సిబ్బందిని ప్రశంసించారు. ఆవిర్భావం సందర్భంగా సెంట్రల్‌ డిస్పాచ్‌ యార్డ్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అవార్డులు
ప్లాంట్‌లో ఎంపికచేసిన ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు 96 మందికి జవహర్‌ నెహ్రూ అవార్డులను అతుల్‌ భట్‌ అందించారు. కఠోర శ్రమ, విధినిర్వహణలో కర్తవ్య దీక్ష ప్రదర్శించినందుకు 21 మంది సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి ప్రశంసా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్‌ అన్ని విభాగాల అధికారులు, కార్మికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.