Jan 25,2023 00:09

సత్యనారాయణమూర్తి కొండపైకి తరలివెళ్తున్న జనం

ప్రజాశక్తి- దేవరాపల్లి : మండలంలోని పెద నందిపల్లిలో విజయ వెంకట సత్యనారాయణమూర్తి స్వామి తీర్థ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల నలమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం గ్రామంలో భారీ అన్న సమారాధన జరిగింది. రాత్రి గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు సత్య దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, కాశీపురం సర్పంచ్‌ ఆదిరెడ్డి వరలక్ష్మి, తదితరులున్నారు.
కె.కోటపాడు : మండలంలోని చౌడువాడ గ్రామంలో శతకం పట్టు రామకోవుల వద్ద ఉన్న సీతారాముల తీర్థం మంగళవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి భక్తులు మొక్కలు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం జిల్లా స్థాయి ఎడ్ల పందెం, సాయంత్రం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రాత్రి కుమార్‌ వారి వీధి యువకులచే సాంఘిక నాటకం, విశాఖ వారిచే డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి దాడి ఎరుకు నాయుడు, సుగర్‌ ప్యాక్టరీ మాజీ డైరెక్టర్‌ రాజ శ్రీనివాసరావు, పాల సంఘం అధ్యక్షులు కుమార వెంకటరమణ పాల్గొన్నారు.