Mar 16,2023 23:48

నివాళులర్పిస్తున్న మేయర్‌, జివిఎంసి కమిషనర్‌

ప్రజాశక్తి-యంత్రాంగం
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలు చోట్ల గురువారం ఘనంగా నిర్వహించారు.
ఎంవిపి.కాలనీ : ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణదీక్ష చేపట్టి, ప్రాణత్యాగం చేసిన మహా పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి కొనియాడారు. జివిఎంసి ప్రధాన కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి కమిషనర్‌ పి.రాజాబాబుతో కలసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు వై శ్రీనివాసరావు, డాక్టర్‌ వి సన్యాసిరావు, ఎస్‌ఎస్‌ వర్మ, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అక్కౌంట్స్‌ సి వాసుదేవరెడ్డి, సెక్రటరి పి నల్లనయ్య, హార్టికల్చర్‌ డిడి ఎం.దామోదరరావు, రెవెన్యూ డిసి ఎంవిడి.ఫణిరాం పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : ఆర్‌టిసి కాంప్లెక్స్‌ సమీపంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జివిఎంసి డిప్యూటీ మేయర్‌ కట్టుమూరి సతీష్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి త్యాగనిరతిని కొనియాడారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకు అమరజీవి కృషి అజరామరమని, నేడు తెలుగువారిగా గుర్తింపు పొందుతున్నామంటే ఆయన త్యాగాలే ప్రధాన కారణమన్నారు.
పద్మనాభం : మండలంలోని గంధవరం గ్రామానికి చెందిన వాసవి క్లబ్‌ ఆధ్వర్యాన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని వాసవి క్లబ్‌ సహకారంతో 500 లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకును, సీలింగ్‌ ఫ్యాన్‌ను పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్‌ ప్రతినిధులు సిహెచ్‌ వెంకటరమణ, ఎ.శ్రీనివాసరావు, కెవి.బంగారుచిట్టి, పి.గుప్తాజీ తదితరులు పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక బీచ్‌లో ఉన్న జివిఎంసి పొట్టి శ్రీరాములు పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి టిడిపి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, మూడో వార్డు ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంద్రకుమార్‌, నాయకులు కె.నాగరాజు, కె.అప్పలనాయుడు, జి.పోలిరాజు, ఎస్‌.జోగారావు పాల్గొన్నారు.
భీమిలి మండలం సింగనబంద పంచాయతీ కృష్ణంరాజుపేట ఎంపి యుపి పాఠశాలలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి హెచ్‌ఎం వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు నాగమణి, సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు
విశాఖపట్నం : ఏయూ విద్యా విభాగంలో పాట్టి శ్రీరాములు చిత్రపటానికి విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌ రాజు పూలమాల వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉక్కునగరం : ఉక్కునగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి సేవాదళ్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనను స్మరించు కోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్‌ నేతలు బెల్లాల పెంటబాబు, కడిమిసెట్టి వీర్రాజు, దాసరి సొంబాబు, సిహెచ్‌.రవికుమార్‌, కృష్ణమోహన్‌, మధుసూదన్‌, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు .
ఉక్కునగరంలోని కేండిల్‌ జంక్షన్‌ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తితో విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు చిత్తశుద్ధితో కార్మికులు పోరాడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, జనరల్‌ సెక్రెటరీ దాసరి పుల్లారావు, గొందేసి అప్పలరెడ్డి పాల్గొన్నారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు
పొట్టి శ్రీరాములు : డిఆర్‌ఒ
అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతో పాటు భాష ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు ఆద్యుడని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ కొనియాడారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం పొట్టి శ్రీరాములు 123వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక మెయిన్‌ రోడ్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పొట్టి శ్రీరాములు భవన నిర్మాణ నిర్వాహకులు పిరాట్ల నరసింహమూర్తి ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులు అర్పించారు. స్థానిక రామచంద్ర థియేటర్‌ జంక్షన్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, నాయకులు గైపూరి రాజు, కాండ్రేగుల శ్రీనివాస్‌ తదితరులు నివాళులర్పించారు. ఇక్కడే సిద్ధార్థ సోషల్‌ సర్వీస్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ ఎస్సై బంగారు రాజు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పాదచారులకు మిఠాయిలు బిస్కెట్లు పంపిణీ చేశారు. సత్యనారాయణపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు గండేపల్లి తులసి లక్ష్మి ఆధ్వర్యంలో, ఏఎంఏఎల్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ గల్లా జయ బాబు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. స్కూల్‌ కమిటీ చైర్మన్‌ వెంకట్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
చోడవరం : చోడవరం వాసవి మెయిన్‌ క్లబ్‌, వనితా క్లబ్‌, కపుల్స్‌ క్లబ్‌ వారి ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య చిన్న సత్రంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. క్లబ్‌ ప్రతినిధులు కలగర్ల శేషగిరిరావు వెంకట మధు, పివి. రమణమూర్తి, ఆర్యవైశ్య సంఘ భవనం చైర్మన్‌ కొల్లూరు మంగరాజు, కిరాణావర్తక సంఘం ప్రెసిడెంట్‌ పసుమర్తి వెంకట్‌ పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌, ఈవోపీఆర్డి పి ఈశ్వరరావు, మూలపేట గ్రామ సర్పంచ్‌ బీ శెట్టి గంగప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక ప్రభుత్వ ఉన్నత ఉన్నత పాఠశాలలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంఇఒ యస్‌.అప్పలరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్‌ చిన్నమ్మాయి, ఉపాధ్యాయులు పి. రాధాకుమారి, పివి.భాస్కర రావు, జి.శ్రీరామమూర్తి, జి. గురునాథరావు, సిహెచ్‌.కుమార్‌ ప్రకాష్‌, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక శాఖా గ్రంధాలయంలో గ్రంధాలయాధికారి పివి.రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ స్కూల్‌ హెచ్‌ఎం డిఎన్‌బి.కుమారి తదితరులు పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పి.ప్రసాద్‌ పాల్గొన్నారు.
నక్కపల్లి : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సందర్భంగా ఇంచార్జి హెచ్‌ఎం ఎన్‌.అప్పారావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబూజీ, చౌదరి, సుందర్రావు, విశ్వనాధ్‌, పీడీ కుందూరు రాజు, సత్తిబాబు పాల్గొన్నారు.
కొత్తకోట: రావికమతం మండలం కొత్తకోటలో శ్రీ వాసవి, వనితా క్లబ్‌ సభ్యుల ఆధ్వర్యంలోనూ, టి.అర్జాపురంలో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలలో పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సిఐ సయ్యద్‌ ఇలియాస్‌ అహ్మద్‌, ఎస్‌ఐ విభూషణరావు, గ్రామ సర్పంచ్‌ కోన లోవరాజు, ఉప సర్పంచ్‌ పందల దేవ, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ గుమ్ముడు సత్య దేవ్‌, శీలం శంకరరావు, గుమ్ముడు దొరబాబు, క్లబ్‌ అధ్యక్ష కార్య దర్శిలు కె.రమేష్‌, నరేంద్ర, అశోక్‌, హారిక, లావణ్య నివాళులు అర్పించారు.
నర్సీపట్నం టౌన్‌ : వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక పాల్ఘాట్‌ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలోని బాలికలకు టూత్‌ బ్రష్‌లు, మిఠాయిలను పంచారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ కార్యనిర్వాహక సభ్యులు వెలగా నారాయణరావు, ఆయుష్మాన్‌ వాసవి క్లబ్‌ అధ్యక్షుడు కుసుమంచి వెంకటకృష్ణ పాల్గొన్నారు. స్థానిక శాఖ గ్రంథలయంలో పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్‌ ధమయంతి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మెయిన్‌ పాఠశాల ఉపాద్యాయులు నారాయణరావు మాట్లాడారు.
గొలుగొండ : స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంధాల యాధికారి రాజుబాబు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజిబివి విద్యార్థినిలు పాల్గొన్నారు.