Aug 22,2023 23:34

గుంటూరులో దుప్పట్లు పంపిణీ చేస్తున్న మేయర్‌

ప్రజాశక్తి-గుంటూరు : నటనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ స్టార్‌ రేటింగ్‌తో చిరంజీవి తెలుగు ప్రజల్లో మెగాస్టార్‌గా నిలిచారని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు అన్నారు. మంగళవారం మెగాస్టార్‌ చిరంజీవి 67వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సంపత్‌ నగర్‌లో మెగా అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో మేయర్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పేదవారికి దుప్పట్లను పంపిణీ చేశారు. చిరంజీవి స్వశక్తితో తెలుగు సినీ ఇండిస్టీలో తిరుగులేని హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారన్నారు. విభిన్నమైన తన నటనతో, డాన్స్‌, ఫైట్స్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాప్తి చేశారని చెప్పారు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ల ద్వారా సేవలోనూ తనకు సాటిలేరని నిరూపించారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జి.నాగరంగమణి, రమేష్‌, టి.హనుమాయమ్మ, యోగేశ్వరరావు, కె.శ్యామ్‌ శేఖర్‌, ఖాజామొహిద్దీన్‌, టెంట్‌ హౌస్‌బాబు, మస్తాన్‌వలి, ఎ.రమేష్‌ పాల్గొన్నారు.
వేద సీడ్స్‌ కార్యాలయంలో
గుంటూరులోని వేద సీడ్స్‌ కార్యాలయంలో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తులసి ధర్మచరణ్‌ పర్యవేక్షణలో చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద సీడ్స్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ తోట రంగారావు, మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ అడపా శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి కేక్‌ కట్‌ చేశారు. తోట రంగారావు మాట్లాడుతూ సినీరంగంలో తిరుగులేని మహోన్నత వ్యక్తి చిరంజీవి అన్నారు. పేద ప్రజలకు, సినీ అభిమానులకు ఆయన ఎన్నో పనులు చేపట్టారన్నారు. 45 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని శిఖరాగ్ర స్థాయికి చేరారన్నారు. అడపా శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తనిధి కేంద్రం, ఐ బ్యాంక్‌ వంటి సేవా కార్యక్రమాల ద్వారా యువతను సేవా మార్గంవైపు నడిపించారన్నారు. కార్యక్ర మంలో శివరామకృష్ణ, జి.సతీష్‌కుమార్‌, జి.మనోహర్‌రెడ్డి, టి.శ్రీనివాసరావు, ఐ.వెంకటేష్‌, కె.నరేంద్రబాబు పాల్గొన్నారు.