ప్రజాశక్తి-బాపట్ల: పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ అన్నారు. బాపట్లలో సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మేడే వేడుకల్లో వారు మాట్లాడారు. మేడే సందర్భంగా బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం పతాకాన్ని జిల్లా పార్టీ కార్యదర్శి సిహెచ్ గంగయ్య ఆవిష్కరించారు. సిఐటియు పతాకాన్ని ఆ సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ ఆవిష్కరించారు. బాపట్ల పట్టణంలో పలుచోట్ల సిఐటియు పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. మేడే సందర్భంగా కార్మిక వర్గం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రతిన పూనాలన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, రైల్వేస్టేషన్ మీదుగా సాగి తిరిగి పాత బస్టాండ్ చేరుకుంది. ఈ ర్యాలీలో అంగన్వాడీలు ఎజిబిటెక్, ఏజీ ఫామ్, ఆటో వర్కర్లు, హమాలీలు, ఆర్టీసీ రంగాల కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, వై భాస్కరరావు, సిఐటియు నాయకురాలు సుభాషిణి, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్య, మనోజ్, బాపట్ల పట్టణ సిఐటియు నాయకులు జె శామ్యూల్, బుచ్చిరాజు, శ్రీనివాసరావు, నిరంజన్, లక్ష్మణ, బాబు పాల్గొన్నారు.
ఉప్పరపాలెంలో మేడే పతాకావిష్కరణ
ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన బాపట్ల పట్టణంలోని ఉప్పరపాలెంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎంఉప్పరపాలెం శాఖ కార్యదర్శి షేక్ మహబూబ్ సుభాని, పార్టీ సభ్యులు రాజు వెంక రెడ్డి, అక్కల రంగారెడ్డి, సుబ్బారెడ్డి, పలువురు పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.
చీరాల: కార్మికుల సమస్యల పరిష్కారం పోరాటాలతోనే సాధ్యమవుతుందని సిఐటియు నాయకులు అన్నారు. సోమవారం అంతర్జాతీయ మేడే దినోత్సవ సందర్భంగా సోమవారం సిఐటియు చీరాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు చీరాలలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూరగాయల మార్కెట్, ఐఎల్టిడి యూనియన్, మున్సిపల్ కార్యాలయం, సిఐటియు కార్యాలయం, గడియార స్తంభం సెంటర్, టాక్సీ డ్రైవర్ యూనియన్, ఫోర్ వీల్స్ ఆటో, ఏపీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్, హైర్ బస్ వర్కర్స్ యూనియన్, ఎల్ఐసి యూనియన్ పలుచోట్ల జండా ఆవిష్కరణ నిర్వహించారు. సిఐటియు జెండాను సిఐటి కోశాధికారి ఆర్విఎస్ రామిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్ బాబురావు మాట్లాడుతూ కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించిన కార్మిక చట్టాలను దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఏకమై మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి వసంతరావు కమిటీ సభ్యులు సింగయ్య, ఝాన్సీ, కెవిపిఎస్ నాయకులు జయరాజు, జనవిజ్ఞాన వేదిక నాయకులు కుర్రా రామారావు, కె యోహాన్, జి సుధీర్, జి నాగేశ్వరరావు, బి ఝాన్సీ, రామారావు, డి నారపరెడ్డి, ఎస్కె కాలేషా, పట్టణ ప్రజా సంఘాల నాయకులు, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు జి సుజీవన తదితరులు పాల్గొన్నారు.










