ప్రజాశక్తి-అచ్యుతాపురం
మండల కేంద్రంలోని కైట్స్ కళాశాలలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. బుధవారం కళాశాలలో జరిగిన వీడ్కోలు సభలో సీనియర్, జూనియర్ విద్యార్థులు సరదా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ రెడ్డి చిరంజీవి మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను, తోటి విద్యార్థులను ఎన్నటికీ మరువరాదని సూచించారు. ఉన్నత చదువులు చదివి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆడారి అప్పలనాయుడు మాట్లాడుతూ విదార్థులు ఎప్పటికప్పుడు కొత్తవిషయాలను తెలుసుకోవాలన్నారు. కైట్స్ విద్యావిహార్ స్కూల్ కరెస్పాండెంట్ రెడ్డి గణేష్ మాట్లాడుతూ చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆడారి సన్యాసిరావు, డైరెక్టర్స్ అడిగర్ల శంకరరావు, విల్లూరి ప్రసాద్, సరిసా నాగేశ్వరరావు పాల్గొన్నారు.










