Nov 12,2022 00:41

పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ విసి ముత్యాలనాయుడు, కాసీం తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌలానా ఆజాద్‌ చిత్రపటానికి కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాద్‌ స్ఫూర్తితో దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దేశంలో అందరికీ ఉచిత విద్యతో పాటు అనేక విద్యా సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెసి కల్పనా కుమారి, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు జానకి దేవి, సాంబమూర్తి, ఫ్యూచర్‌ వరల్డ్‌ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 135వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక అయ్యన్న విద్యాసంస్థల్లో ఆయన విగ్రహానికి మాజీ విసి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు, అయ్యన్న విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ ఖాసీం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆత్మవిశ్వాసంతో, ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వ అధికారులై ఆదర్శంగా నిలిచిన నక్కపల్లి సబ్‌-రిజిస్ట్రార్‌ జిలాని బేగం గౌసియా, దొడ్డిగల్లు పంచాయతీ కార్యదర్శి షంసున్నీసా బేగంను అయ్యన్న విద్యాసంస్థల తరఫున జ్ఞాపికలను అందజేసి, సత్కరించారు. ఏయూ ఎంప్లాయిస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ డైరెక్టర్‌ షేక్‌ ఖాదర్‌ బాబాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎయు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నాయకులు వల్లి శ్రీనివాస్‌, ఎస్‌.వీరకుమార్‌, స్కూల్‌ ప్రిన్సిపల్‌ హరిషా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి పివి.రమణ ఆధ్వర్యంలో ఎంపిపి స్కూల్‌ ఉపాధ్యాయరాలు డిఎన్‌బి.కూమారి అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జయంతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి.సింహాద్రి, ఆంగవాడీ టీచర్‌, పాఠకులు పాల్గొన్నారు.