ప్రజాశక్తి-విజయనగరం కోట : మహాకవి గురజాడ వెంకట అప్పారావు 161వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. గురజాడ స్వగృహంలో ఆయన చిత్ర పటానికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, కలెక్టర్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, గురజాడ కుటుంబ సభ్యులు ప్రసాద్, ఇందిర తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయి గేయాన్ని ఆలపిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్ధులతో గురజాడ జంక్షన్ వరకు గురజాడ వినియోగించిన వస్తువులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ గురజాడ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ తన రచనల ద్వారా దేశ భక్తిని పెంపొందించాలని 161 ఏళ్ల క్రితమే జాతికి దిశా నిర్దేశం చేసిన వ్యక్తి గురజాడ అని గుర్తు చేసారు. అనేక మంది సందర్శకులు లైబ్రరీకి వస్తున్న దృష్ట్యా వారి సౌకర్యార్ధం లైబ్రరీ లో మౌలిక వసతుల కల్పనకు జిల్లా పరిషత్ నుంచి నిధులను సమకూర్చనున్నట్లు చైర్మన్ తెలిపారు. అందుకోసం ఒక కమిటీ ని ఏర్పాటు చేసి, ఏమేమి అవసరం అవుతాయో నివేదిక తయారు చేయాలని కలెక్టర్ కు కోరారు.

కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ గురజాడ చిర స్మరనీయులని, వారి రచనలు ఎన్ని తరాలకైనా అనుసరనీయమని అన్నారు. గురజాడ గృహంలో గురజాడ వినియోగించిన వస్తువులను , గురజాడ స్టాంప్ ను చేతి రాతలను, కళ్ళద్దాలను, గురజాడ సేకరించిన పుస్తకాలను , ఎగ్జిబిషన్ రూమ్ లో గురజాడ సమకాలీన కవులు, మేధావుల చిత్ర పటాలను చైర్మన్, కలెక్టర్ సందర్శించారు. గోల్డెన్ హెరిటేజ్ అఫ్ విజయనగరం వారి వితరణతో గురజాడ గృహం లో సందర్శకుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన ఆర్ఒ ప్లాంట్ను కూడా చైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి , సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్ , మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, జిల్లా పర్యాటక అధికారి లక్ష్మి నారాయణ, , డిఐపిఆర్ఒ దున్నా రమేష్ , తహశీల్దార్ కోరాడ శ్రీనివాస రావు, గురజాడ సమాఖ్య ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, సూర్య లక్ష్మి, గోపాలరావు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్ధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర రావు గురజాడ గృహాన్ని సందర్శించారు. గురజాడ చిత్రపటానికి పూల మాలలను వేసి నివాళులర్పించారు.

జెఎన్టియు జివిలో వేడుకలు
విజయనగరం టౌన్ : జెఎన్టియు గురజాడ విశ్వ విద్యాలయంలో గురజాడ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. గురజాడ చిత్రపటానికి వైస్ ఛాన్సలర్ కె.వెంకట సుబ్బయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, అరసం అధ్యక్షులు జిఎస్ చలం, ఆలిండియా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరుశివప్రసాద్, కార్యదర్శి శరత్చంద్ర జ్యోతిశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. వ్యాఖ్యాతగా అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ, కోఆర్డినేటర్గా డాక్టర్ బి.నలిని వ్యవహరించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం ముద్రించిన గురజాడ కవితా సంకలనాన్ని
ఆవిష్కరించారు.
గురజాడ అభ్యుదయ దార్శనికుడు
గురజాడ అప్పారావు గొప్ప సంఘ సంస్కర్త, ఆధునిక అభ్యుదయ వాది అని జనసేన నాయకులు గురాన అయ్యలు పేర్కొన్నారు. గురాజాడ స్వగృహంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ రోడ్డులో గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డి.రామచంద్రరాజు, విసినిగిరి శ్రీనివిసరావు, కాటం అశ్వని,మాతా గాయిత్రి, , దుప్పాడ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.










