Sep 04,2023 00:04

ధనరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-కూర్మన్నపాలెం : స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులుగా పనిచేసి కార్మికుల మన్నన పొందిన నాయకుడు వంకా దనరాజు 11 వర్థంతిని ఘనంగా నిర్వహించారు. సిఐటియు నాయకులు మోహిద్దీన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ధనరాజు చిత్రపటానికి సీనియర్‌ నాయకులు ఎస్‌ఎన్‌.మూర్తి, డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైటి.దాస్‌, రామస్వామి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సందర్భంలో ధనరాజు లాంటి నాయకులు లేకపోవడం తీరనిలోటు అన్నారు. ఏ సమస్యనైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి కార్యకర్తలను, కార్మికులను చైతన్యం చేయడంలో ధనరాజు పాత్ర కీలకమైనదని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం, కార్మిక హక్కులను రక్షించుకోవడం ధనరాజుకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్‌శేఖర్‌, కెఆర్‌కె.రాజు, పవన్‌, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.