Feb 02,2023 23:25

చెరువులోకి చేపలు వదులుతున్న అటవీశాఖ అధికారులు, విద్యార్థులు

ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆధ్వర్యాన గురువారం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని కొండకర్ల ఆవలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వివిధ పాఠశాలల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు, వన్యప్రాణి ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, బర్డ్‌ వాచర్స్‌ పాల్గొన్నారు. చిత్తడి నేలల ప్రాముఖ్యతను బర్డ్‌వాక్‌, నేచర్‌ వాక్‌ నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా కొండకర్ల ఆవలో పలు ముఖ్యమైన మంచినీటి చేపలను విడుదల చేశారు. స్థానిక మత్స్యకారులచే చేపలు పట్టే వివిధ సంప్రదాయ పద్ధతులను ప్రదర్శించారు. విశాఖపట్నం చిత్తడి నేలల ప్రాముఖ్యత, చిత్తడి నేలల సంరక్షణకు అటవీశాఖ చేస్తున్న కృషి, స్థానిక సంఘాల ప్రమేయం గురించి వివరించారు. ఎపిలో చిత్తడి నేలల పరిరక్షణకు అటవీ శాఖతో సమర్ధవంతమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్‌ సంస్థలు, పౌర సమాజం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.